Saturday, 23 January 2021

టాటా నానో పరిశ్రమ - సింగూర్ నష్టం - సానంద్ లాభం

పెద్ద పోస్ట్, పూర్తిగా చదవండి. విస్తృతంగా షేర్ చేయండి

టాటా మోటార్స్ 2006 సం. లో పశ్చిమ బెంగాల్ లో సింగూర్ వద్ద మధ్య తరగతి ప్రజలకు ఒక లక్ష రూపాయల కు లభ్యం అయ్యే విధంగా నానో కారును తయారు చేయడానికి ఫ్యాక్టరీ పెట్టి 2008 నాటికి ఫ్యాక్టరీ నుండి మొదటి కారు బయటకు రావాలని లక్ష్యంగాపెట్టుకున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం సూచించిన ఆరు సైట్లలో టాటా కంపెనీ సింగూర్‌ను ఎంపిక చేసింది. ఫ్యాక్టరీ నిర్మించడానికి కావలసిన 997 ఎకరాల భూమి రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుండి 2006లో సేకరించింది. దానికి ఫెన్సింగ్ వేసింది. గొడవలు జరగ కుండా ఫెన్సింగ్ దగ్గర రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను,  సీపీఎం పార్టీ తమ కార్యకర్తలును కాపలాగా పెట్టారు

భూములు కోల్పోతున్న రైతుల నుండి భారీ వ్యతిరేకత ఎదురైంది.  ఈ రైతులకు అప్పటి ప్రతిపక్ష నాయకురాలు మమతా బెనర్జీ రాజకీయ మద్దతు ఇచ్చారు. ఉద్యమానికి మేధా పట్కర్ , అనురాధ తల్వార్, అరుంధతి రాయ్, కలకత్తా వామపక్ష మేధావులు అమర్త్య సేన్, అపర్ణ సేన్, కౌశిక్ సేన్, షావోన్లీ మిత్రా, సువప్రసన్న కూడా మద్దతు ఇచ్చారు. 

భూమిలేని రైతులకు వ్యవసాయ భూమిని వాగ్దానం చేయడం ద్వారా వామపక్ష నాయకులు అధికారాన్ని సంపాదించారు. కాని పశ్చిమ బెంగాల్ జనాభా సాంద్రత దృష్ట్యా, భూములు చిన్నవి కావడంతో పేద కుటుంబాలను పైకి తీసుకురావడానికి వాటిలో వచ్చే దిగుబడి సరిపోదు. వ్యవసాయం నుండి పారిశ్రామిక ఉద్యోగాలకు మళ్లించడానికి తగ్గ పారిశ్రామిక అభివృద్ధి జరగలేదు. వామపక్ష మద్దత్తు గల యూనియన్స్ పారిశ్రామిక యజమానుతో వ్యవహరిస్తున్న తీరు వల్ల కొత్త పరిశ్రమలు రావడం లేదు.

టాటా ప్రాజెక్టు కోసం అనేక ఇతర రాష్ట్రాలు టాటా మోటార్స్‌కు భూమిని ఇస్తాం అని ముందుకు వచ్చాయి. కానీ పైన చెప్పిన కారణాలు గుర్తించిన వామపక్ష ప్రభుత్వం టాటా వాళ్ళు ఇక్కడ పరిశ్రమ పెడతాము అంటే భూ సేకరణ చేసి మిగతా ఆటంకాలు లేకుండా చూస్తామని టాటా కంపనీకి హామీ ఇచ్చారు.
టాటా కంపనీ తాము కార్ల పరిశ్రమ ప్రారంభిస్తే తమతో పాటు మరో 70 సంస్థలు కూడా ఇక్కడ తమ ఉత్పత్తులను తయారు చేస్తారు, వెయ్యి కోట్ల పెట్టుబడులు వచ్చి ఇది దేశంలో ఒక ఇండస్ట్రియల్ హబ్ గా తయారు అవుతుంది అని చెప్పింది.

అందుకే వామపక్ష ప్రభుత్వం ఇక్కడ  భూమిలో ఉంటున్న ప్రజలను బలవంతంగా ఖాళీ చేయించింది. ఇచ్చిన పరిహారం సరిపోదని,
కొత్త గృహ సౌకర్యాలు ఆలస్యం అయ్యాయి అని ఈ ప్రాజెక్ట్ ప్రారంభం నుండే వివాదాన్ని సృష్టించింది. ప్రత్యేకించి ప్రైవేటు సంస్థల కోసం సారవంతమైన వ్యవసాయ భూమిని రాష్ట్రం స్వాధీనం చేసుకోవడంపై ఆందోళనలు రేగాయి.

విచిత్రం ఏమిటంటే ఇటువంటి ఆందోళనకు ఎప్పుడూ ముందు ఉండే CPM ఈ ఆందోళనలను తమ ప్రభుత్వ దమన నీతితో అణిచివేయడానికి ప్రయత్నించడమే కాదు CPM కార్యకర్తలు ఆందోళన కారులపై దాడులు వంటివి కూడా చేశారు. అంతే కాదు అక్కడ సిపిఎం నాయకులు ఆందోళన కారుల్లో స్త్రీలను రేప్ చేశారు అని ఆరోపణలు వచ్చాయి. ఈ రేప్ ఆరోపణల మీద థేబు మాలిక్, సుహిద్ దత్తా అని ఇద్దరు సీపీఎం నాయకులను సీబీఐ అరెస్టు చేసింది.  ఈ ఉద్యమంలోకి నక్సల్స్ ప్రవేశించారు అని కూడా CPM ఆరోపించింది. 

అక్టోబర్ 3వ తేదీన టాటా కంపనీ సింగూర్ ప్రాజెక్ట్ ఆపేస్తున్నట్లు, తమ నానో కార్ల ఉత్పత్తి గుజరాత్ రాష్ట్రంలో సానంద్ వద్ద పెడతాం అని అధికారంగా ప్రకటించింది.

కొందరు ఉద్యమ వేత్తలు కోర్టుకు కూడా పోయారు.   టాటా మోటార్స్ కోసం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 997 ఎకరాల వ్యవసాయ భూమిని స్వాధీనం చేసుకోవడాన్ని 2016 లో సుప్రీంకోర్టు రద్దు చేసింది మరియు 9,117 మంది భూస్వాములకు భూములు తిరిగి ఇవ్వమని ఆదేశించింది. 

దాంతో సింగూర్ కధ కంచికి...😪

ఇక సానంద్ కధ:

ఎప్పుడు అయితే టాటా బెంగాల్ నుండి తమ పరిశ్రమ తరలిద్దాం అని అనుకుందో వెంటనే అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి మోడీ మా రాష్ట్రానికి రండి ఏ గొడవలు లేకుండా ఒక సం. లోపు మీరు కార్ల ఉత్పత్తి ప్రారంభించవచ్చు అని హామీ ఇచ్చి టాటా నానో కంపనీ తమ రాష్ట్రానికి తరలించుకు పోయారు. 

సానంద్ గుజరాత్ లో అహమ్మదాబాద్ దగ్గర ఉంది. అక్కడ మరి భూసేకరణ సమస్య రాలేదా? వచ్చింది.  అక్కడ 6 గ్రామాల్లో 1100 ఎకరాలు స్వాధీనం చేసుకుంటాం అని ప్రభుత్వం ప్రకటించింది. మూడు వేల మంది రైతులు గొడవ చేస్తే వారితో చర్చలు జరిపి ప్రస్తుత మార్కెట్ రేట్ కి నాలుగు రెట్లు పరిహారం ఇస్తాము అని నచ్చచెప్పడంతో రైతులు ఉద్యమం విరమించారు. ప్రతిపక్షాలు రైతులను రెచ్చగొట్టినా వారు వీరి వలలో పడలేదు. టాటా భూమి ఖరీదులో మూడు వంతులు భరిస్తే రాష్ట్ర ప్రభుత్వం మిగతా పావు వంతు భరించింది.

 ఉత్పత్తి అనుకున్న సమయానికి ప్రారంభించడానికి కావలసిన అన్ని అనుమతులు, సదుపాయాలును మోడీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో జూన్ 2010 అంటే రికార్డ్ టైం లో ఒక్క 14 నెలల్లో ప్యాక్టరీ నుండి మొదటి కారు బయటకు వచ్చింది. ఈ ఫ్యాక్టరీ ప్రత్యక్షంగా 1200 మందికి, పరోక్షంగా పది వేల మందికి ఉపాధి చూపించింది. అక్కడ ఈ ఫ్యాక్టరీలు వల్ల ఎటువంటి కాలుష్యం రాకుండా అక్కడి గ్రామ ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవడంతో  స్థానికుల నుండి ఆ తరువాత కూడా ఏ వ్యతిరేకత రాలేదు.

టాటా పరిశ్రమ అక్కడ విజయవంతంగా ప్రారంభం కావడంతో కొత్త ఆటోమొబైల్ పరిశ్రమలు కొన్ని ఫార్మా కంపెనీలు కూడా 
అక్కడకు వచ్చాయి. ఇప్పుడు సానంద్ లో

1. టాటా
2. ఫోర్డ్
3.హ్యుందాయ్
4. హీరో హోండా
5. హొండా కార్
6. హితాచి
7. జనరల్ ఎలక్ట్రికల్స్
8. కాడిలా హెల్త్ కేర్
వంటి పెద్ద పెద్ద పరిశ్రమలు కాకుండా ఇంకా చాలా చిన్న పరిశ్రమలు వచ్చాయి. స్థానికులకు ఉద్యోగాలు వచ్చాయి. చుట్టుపక్కల గ్రామాల్లో భూ ధరలు విపరీతంగా పెరిగాయి.
అక్కడ రైతులు ఆకస్మికంగా కోటీశ్వరులు అయిపోయారు. ఎకరా 3/4లక్షలు కంటే పలకని ధర నుండి ఇప్పుడు ఎకరా కనీసం కోటి రూపాయలు పైనే పలుకుతోంది.

https://m.rediff.com/news/slide-show/slide-show-1-gujarat-election-sanands-overnight-crorepatis-are-all-for-modi/20121203.htm

అటువైపు సింగూర్ లో రైతులు ఇప్పటికి అదే దుర్భర దారిద్ర పరిస్థితులు అనుభవిస్తున్నారు. తమను రెచ్చగొట్టిన రాజకీయ నాయకులను తిట్టుకుంటున్నారు.

అన్నిటికంటే దారుణం ఏమిటంటే రైతులను రెచ్చగొట్టిన మమత ముఖ్యమంత్రి అయిపోయింది, అమర్త్య సేన్ లు, మేధాపాట్కర్ లు, అరుంధతి రాయ్ లు, అపర్ణ సేన్ లు మళ్ళీ సింగూర్ పోలేదు. వారు హాయిగా విమానాల్లో తిరుగుతూ విదేశీ విహారాలు చేస్తూ, అంతర్జాతీయ అవార్డులు కొట్టేస్తూ, పత్రికల్లో బీదవారు గురించి వ్యాసాలు రాస్తూ, ఉపన్యాసాలు చెపుతూ లక్షల్లో గడిస్తూ విలాసవంతమైన జీవితం గడుపుతూనే వున్నారు. ఇప్పుడు ఈ మేధావి ఉద్యమకారులు సింగూర్ పోతే ప్రజలు తరిమి తరిమి కొడతారు.

గుజరాత్ అభివృద్ధి చెందుతోంది అంటేఅక్కడ వామపక్ష పార్టీల ప్రభావం తక్కువ ఉండడం వల్ల  ప్రజల్లో కూడా ప్రతీదీ వ్యతిరేకించాలి అనే ఆలోచనా ధోరణి కూడా తక్కువ ఉంది.

...చాడా శాస్త్రి..

చిత్రాలు: గూగుల్ సౌజన్యం
                             సింగూర్ - సానంద్

No comments:

Post a Comment